డజను గుడ్లు రూ.400.. కిలో ఉల్లి రూ.250

onion, street vendor
Spread the love

పాకిస్థాన్‌లో ద్రవ్యోల్బణంతో సామాన్య ప్రజలు విలవిల

విపరీతంగా పెరిగిన ఆహార పానీయాల ధరలు

అతిపెద్ద ఆర్థిక సంక్షోభం బారిన పడ్డ దేశాల్లో ఇప్పుడు పాకిస్థాన్ ఉండబోతోంది. ఎందుకంటే ఈ దేశం చరిత్రలోనే ఊహించని ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ప్రతికూల పరిస్థితులు, ఇతరత్రా కారణాల వల్ల ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటోంది. పాకిస్తాన్ అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) నుండి అనేక సార్లు అప్పులు చేయడంతో..  ఇప్పుడు పెద్ద రుణ ఊబిలో కూరుకుపోయే పరిస్థితి వచ్చింది. దీని కారణంగా అక్కడ ద్రవ్యోల్బణం (ధరల పెరుగుదల) అత్యంత గరిష్ఠానికి చేరుకుంది. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ వరల్డ్ ఎకనామిక్ ఔట్‌లుక్ డేటాబేస్ ప్రకారం, పాకిస్తాన్‌లో ద్రవ్యోల్బణం రేటు 2023లో 30 శాతానికి పెరిగింది. ఇదే సమయంలో దేశ జిడిపి -0.5 శాతంగా ఉంది.

దేశంలో ద్రవ్యోల్బణం కారణంగా సామాన్య ప్రజలకు ఆహార పదార్థాలు కొనలేని దారుణ పరిస్థితి ఏర్పడింది. అక్కడ ఇప్పుడున్న రేట్లను చూస్తే కళ్లు తిరిగి కిందపడిపోవడం ఖాయమనే చెప్పాలి. లాహోర్‌లో డజను 12 గుడ్ల ధర ఎంతో తెలుసా.. అక్కడి రేటు ప్రకారం 400 పాకిస్తాన్ రూపాయలకు చేరుకుంది. దీనికి తోడు ఉల్లి ధరలు కూడా ఆకాశాన్నంటుతున్నాయి. దీంతో అక్కడి ప్రజల కష్టాలు మరింత పెరిగాయి.

ఉల్లి ధరలు బాబోయ్..
కోడిగుడ్లతో పాటు ఉల్లి వారి కంట నీరు పెట్టిస్తోంది. ప్రస్తుతం పాకిస్థాన్‌లో కిలో ఉల్లి రేటు అక్షరాల రూ.230 నుంచి రూ.250 వరకు ఉంది. సామాన్యులకు ఊరట కల్పించేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. దీని భాగంగానే ఉల్లి గరిష్ఠ ధర రూ.175గా నిర్ణయించినా.. మార్కెట్‌లో నిర్ణీత ధర కంటే అధికంగా విక్రయిస్తున్నారు.  అయితే ప్రభుత్వం నిర్ణయించిన ధరలను అమలు చేయడం కష్టంగా మారగా, ఎక్కువ రేట్లే ఉండడంతో అక్కడి ప్రభుత్వం, స్థానిక పరిపాలన విఫలమైంది.

చికెన్ ధరలు కూడా..
ఆకాశాన్నంటుతున్న చికెన్ ధరలు కూడా పాక్ ప్రజలకు కోడి మాంసం దూరమయ్యేలా చేస్తున్నాయి. మీడియా కథనాల ప్రకారం, లాహోర్‌లో ఒక కిలో చికెన్ 615 రూపాయల ఉంది, అంటే అక్కడ ద్రవ్యోల్బణం ఏ స్థాయికి చేరుకుందో అర్థం చేసుకోవచ్చు. ఇంకా పాకిస్థాన్‌లో లీటరు పాలు రూ.213 కి చేరగా, టమోటా కిలో రూ.200, బియ్యం కిలో రూ.328కి విక్రయిస్తున్నారు.

విదేశీ మారకద్రవ్య నిల్వలు క్షీణత
పాకిస్థాన్ విదేశీ మారకద్రవ్య నిల్వలు పడిపోతున్నాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాకిస్థాన్ డేటా ప్రకారం, నవంబర్ 2023లో దేశంలో విదేశీ మారక నిల్వలు 7 బిలియన్లుగా ఉన్నాయి. జూలై 2023లో ఇది 8.1 బిలియన్ డాలర్లుగా ఉంది. గత నాలుగు నెలల్లో మారక నిల్వల్లో భారీ క్షీణత కనిపించింది. ఈ పరిస్థితిని చూసి, IMF 3 బిలియన్ డాలర్ల బెయిలవుట్ ప్యాకేజీని ఇవ్వడానికి ప్రకటించింది, అయినప్పటికీ, దేశ ఆర్థిక పరిస్థితి మెరుగుపడటం లేదు.


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *